జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహము ను మానవాళికి ఒసగిన సుదిన మిది , సత్యము, అహింసలు గాంధీగారు కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యంతముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను CNN జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురుగువాడలు శుభ్రము చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింసా పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యులు.
1894లోభారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రముగా వ్యతిరేకించారు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించారు. “ఇండియన్ ఒపీనియన్” అనే పత్రికను ఆయన ప్రచురించారు. “సత్యాగ్రహము” అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశారు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాత్వుత్వము అనే సుగుణాలతో జీవితం సాగించడంలో ఇద ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు, కష్ట నష్టాలకు తట్టుకొని నిలచారు.